మైలార్దేవ్పల్లి ,జూలై10: ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ మధుబన్ కాలనీలో జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సోమ వారం పర్యటించారు. మధుబన్ కాలనీ, పద్మశాలీపురం బస్తీలలో ఎక్కువ శాతం డ్రైనేజీ ,రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. గతంలో జనాభా తక్కువగా ఉండటంతో చిన్న పైపులైన్ వేశారని, దీంతో ప్రతి రోజు కాలనీలో రోడ్లపై మురుగు నీరు పారకుండా శాశ్వత పరిష్కారంగా పైపులైన్ సైజు పెంచి ఎస్టిమేషన్ వేయాలని అధికారులను కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజురూ చేయిస్తానని అన్నారు.
ఇరవై రోజ్లు మధుబన్ కాలనీలో డ్రైనేజీ సమస్య లేకుండా చేయాలని అధికారులను కోరారు. మధుబన్ కాలనీలో పార్కు అభివృద్ధి కోసం రూ. 30 లక్షలు మంజూరు చేయించానని తెలిపారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ కోసం స్థలం ఉన్నట్లయితే తప్పని సరిగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులు జలమండలి వాటర్ ట్యాంకు సమీపంలో ఉన్న గోడౌన్ ను కమ్యూనిటీ హాల్ కు కేటాయించాలని కాలనీ అధ్యక్షుడు డివికుమార్ ఎమ్మెల్యేను కోరగా ,హెచ్ఎండీఏ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించగా అందులో ఉపాధ్యాయుల కొరత ఉందని ప్రధానోపాధ్యాయుడు ఎమ్మెల్యేకు వివరించారు. ఉపాధ్యాయుల కొరతపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ జగన్, ఈఈ నరేందర్ గౌడ్, ఏఈ బల్వంత్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్లు రాహుల్, భాను, జల మండలి డీజీఎం , డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ , మహిళ అధ్యక్షురాలు వజ్రమ్మ,సరికొండ వెంకటేశ్ ,రాఘుయాదవ్ ,కాశీగారి యాదగిరి, డీవీ కుమార్ , విజయ్ కుమార్ ,ప్రశాంత్ గౌడ్ ,యంజాల మహేశ్ రాజ్ ,వెంకటేశ్ ,బొల్ల నరేందర్ ,ఎల్లప్ప,నాని, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తొట్టెల ఊరేగింపు
బోనాల జాతరను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మిగూడలో నిర్వహించిన తొట్టెల ఊరేగింపునకు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడారు. తొట్టెల ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని యువతకు సూచించారు. లక్ష్మిగూడ హనుమాన్ దేవాలయం నుంచి పోచమ్మ దేవాలయం వరకు తొట్టెల ఉరేగింపు పోతరాజుల విన్యాసాలు కొనసాగాయని నిర్వాహకులు తెలిపారు.