సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్గా రోనాల్డ్రోస్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో కార్యదర్శిగా రోనాల్డ్రోస్ విధుల్ని నిర్వర్తించారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన లోకేశ్కుమార్ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. రోనాల్డ్ రోస్కు గతంలో ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉన్నది. కాగా, రోనాల్డ్రోస్ బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
నాలుగేండ్లుగా లోకేశ్కుమార్ తనదైన మార్కు..
వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, పరిపాలనా దక్షుడిగా లోకేశ్కుమార్ జీహెచ్ఎంసీలో తన మార్కు పాలనను చూపించారు. 27 ఆగస్టు 2019లో జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన కరోనా కష్ట సమయంలోనూ బల్దియా టీంను పని చేయించడంలో విజయవంతమయ్యారు. నగరంలో కరోనా కట్టడి బాధ్యతను సైతం ప్రభుత్వం పూర్తిగా జీహెచ్ఎంసీకి అప్పజెప్పింది.
లాక్డౌన్ టైంలో ఎలాంటి ట్రాఫిక్ లేని రోజుల్లో నడిరోడ్డులో చేపట్టిన ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడంలోనూ హైదరాబాద్ నగరంలో సీఆర్ఎంపీ ప్రాజెక్టు కింద వందలాది కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేయడంలో లోకేశ్కుమార్ తన మార్కును చూపించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడంలో, ప్రభుత్వం ఇచ్చిన టాస్కులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లడంలో లోకేశ్ తనదైన పాత్ర పోషించారు. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులపై ఫోకస్ చేసి అందులో చాలా వరకు క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.