బంజారాహిల్స్, సెప్టెంబర్ 10: దారి దోపిడీకి పాల్పడి, ఓ ఇంట్లో దాక్కున్న నేరస్తులను పట్టుకునేందుకు బంజారాహిల్స్ డీఐ జోమాటో డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. పక్కా ప్లాన్తో ముగ్గురు నిందితులను పట్టుకొని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి.. నిందితులను పట్టుకున్న డీఐతోపాటు సిబ్బందిని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బేగంబజార్ ప్రాంతానికి చెందిన అనూజ్ (20) శనివారం తెల్లవారుజామున మాదాపూర్ నుంచి సీవీఆర్ జంక్షన్ మీదుగా బంజారాహిల్స్లోని ఓమేగా ఆస్పత్రి వైపు బైక్పై వెళ్తున్నాడు. సీవీఆర్ జంక్షన్ దాటాక అతడు బైక్ ఆపి ఫోన్లో మాట్లాడుతుండగా.. ముగ్గురు ఆగంతకులు బైక్పై వచ్చి అటకాయించారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. సెల్ఫోన్ లాక్కునేందుకు యత్నించగా అనూజ్ ప్రతిఘటించాడు. కత్తితో దాడిచేసి అతడి వద్ద నుంచి సెల్ఫోన్, బ్లూటూత్, వెండి గొలుసు, బైక్ తాళాలు లాక్కుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్తో పాటు క్రైం సిబ్బంది సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులు ఫిలింనగర్ నుంచి షేక్పేట వైపు వెళ్లినట్లు గుర్తించారు.
ఫిలింనగర్ పరిధిలో మరో దోపిడీ..
ఇదిలా ఉండగా.. ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని షేక్పేట డీమార్ట్ షోరూమ్ వెనకాల ఉన్న బస్తీలో రోడ్డుపై వెళ్తున్న వాచ్మన్పై ముగ్గురు దుండగులు దాడి చేశారు. అతడి వద్ద నుంచి సెల్ఫోన్ లాక్కున్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా రెండు ఘటనల్లో దారి దోపిడీకి పాల్పడింది ఆ ముగ్గురేనని తేలింది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
నిందితుల గుర్తింపు..
దారి దోపిడీలకు పాల్పడిన నిందితులు జహీరానగర్కు చెందిన మహ్మద్ జుబేర్ (24) అనే స్విగ్గీ డెలివరీ బాయితో పాటు చింతల్బస్తీకి చెందిన అబ్దుల్ సుభాన్(23), ఇంటర్ చదువుతున్న యువకుడు(17) అని తేలింది. ఈ ముగ్గురు కొంతకాలంగా గంజాయితో పాటు మద్యానికి బానిసలయ్యారు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
జోమాటో డెలివరీ బాయ్ అవతారంలో డీఐ..
ముగ్గురు సభ్యులున్న ఈ ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్ఫోన్ డాటా, టవర్ లోకేషన్ ఆధారంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని బంధువుల ఇంట్లో మహ్మద్ జుబేర్, సుభాన్ దాక్కున్నట్టు గుర్తించారు. రాత్రి 12.30 ప్రాంతంలో నిందితులు ఉన్న ఇంటిని గుర్తించిన బంజారాహిల్స్ డీఐ జకీర్ హుస్సేన్, మరో కానిస్టేబుల్ ఇంటిలోకి వెళ్లేందుకు అవకాశం కోసం వేచి చూశారు. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి వెళ్లి సోదాలు చేయడం ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావించిన డీఐ జకీర్ హుస్సేన్.. అదే సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న జోమాటో డెలివరీ బాయ్ని ఆపాడు. అతడి వద్ద నుంచి జోమాటో డ్రెస్ తీసుకుని ధరించాడు. పార్సిల్ ఉన్న బాక్సుతో అతడి బైక్పై ఇంటి ఆవరణలోకి వెళ్లాడు. నిందితులు దాక్కున్న ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టగా.. నిందితుల బంధువు తలుపు తీసింది. జుబేర్ ఫుడ్ ఆర్డర్ పెట్టాడని, ఇదే లోకేషన్లో ఉన్నట్లు చెప్పారని డీఐ జకీర్ హుస్సేన్ చెప్పాడు. తాము ఎలాంటి ఆర్డర్ పెట్టలేదంటూ ఇంట్లో నుంచి డోర్ వద్దకు వచ్చిన జుబేర్ను పోలీసులు పట్టుకున్నారు. జుమోటో బాయ్ గెటప్ను తీసేసిన డీఐ.. బంజారాహిల్స్ క్రైం పోలీసులమని చెప్పాడు. మిగతా ఇద్దర్ని కూడా పట్టుకున్నారు. నిందితుల వద్దనుంచి రెండు సెల్ఫోన్లు, దోపిడీకి ఉపయోగించిన రెండు బైక్లు, కత్తి, వెండి గొలుసును స్వాధీనం చేసుకున్నారు. గంటల వ్యవధిలోనే నేరస్తులను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్తో పాటు సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ సీవీ. ఆనంద్ అభినందించారు.