అడ్డగుట్ట, డిసెంబర్ 6 : కారులో లిఫ్ట్ ఇస్తామంటూ దారి దోపిడీకి పాల్పడుతున్న ఓ ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందనా దీప్తి, అదనపు డీసీపీ యోగేశ్ గౌతమ్, ఏసీపీ సుధీర్ వివరాలను వెల్లడించారు. బండ్లగూడ హఫీజ్పేటకు చెందిన ఫసీఅహ్మద్ అలియాస్ అమీర్ (30), బండ్లగూడకు చెందిన మహ్మద్ ఖాలీద్(25), సింగరేణి కాలనీకి చెందిన మహ్మద్ పాషా(32), చంచల్గూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ హుస్సేన్ అలియాస్ కాలా జామూన్(31), యాకుత్పురకు చెందిన మహ్మద్ ఖాన్(35) ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా అద్దె కారుల్లో తిరుగుతూ దారి దోపిడీకి పాల్పడుతున్నారు. బోయిన్పల్లి, గోపాలపురం పరిధిలో అర్ధరాత్రి సమయంలో కాల్ సెంటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాహనాల కోసం ఎదురు చూస్తుంటే వారి వద్దకు వెళ్లి కారులో ఎక్కించుకుంటారు.
నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దోపిడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 23న లాలాపేటకు చెందిన షేక్ అప్సర్ జానీని సంగీత్ చౌరస్తా వద్ద ఎక్కించుకొని ఇలాగే నగదు దోచుకెళ్లారు. దీంతో బాధితుడు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు చిలకలగూడ చౌరస్తాలో నిఘా పెట్టి నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా సూత్రధారి ఫసీ అహ్మద్ పరారీలో ఉండగా.. మిగిలిన వారినుంచి రెండు కార్లు, 13 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.