సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వం రహదారులను అభివృద్ధి చేస్తున్నది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక వసతులను కల్పిస్తుండగా..ఇందులో ప్రధానంగా రోడ్ నెట్వర్క్ను విస్తరిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ ఏడాది రోడ్ నెట్వర్క్ను పెంచడానికి రూ. 308.04 కోట్ల వ్యయంతో 53 చోట్ల పనులకు శ్రీకారం చుట్టి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సీఆర్ఎంపీ రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అంతర్గత రోడ్లతో పాటు వీలైనంత మేర వాక్యూమ్ డీ వాటర్ సిమెంట్ కాంక్రీట్ (వీడీసీసీ) రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ ఏడాదిలో చేపడుతున్న రోడ్ నెట్వర్క్ పనుల వివరాలు..
ఈ ఏడాదిలో 53 చోట్లకు గానూ రూ. 308.21 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రూ.63.75 కోట్లతో 19 చోట్ల చేపట్టిన పనులను పూర్తి చేశారు.
రూ.104.18కోట్లతో 15 చోట్ల చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి.
రూ.14.22 కోట్లతో నాలుగు చోట్ల చేపట్టిన పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
రూ.16.23కోట్లతో ఐదు చోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి.
రూ.109.82 కోట్లతో 10 చోట్ల పనులకు పరిపాలన అనుమతులు రావాల్సి ఉంది.
ఎన్ఓసీ ఉంటేనే రహదారుల పనులు
కాలనీ, బస్తీల్లో రోడ్డు పునర్నిర్మాణం/కార్పెటింగ్ చేయాలనుకుంటే జలమండలి, టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి తప్పనిసరిగా నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగు/మురుగునీటి పైపులైన్ పనులు లేవని జలమండలి, భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేసేది లేదని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆయా విభాగాల పనులు ఉన్న పక్షంలో ప్రతిపాదిత పనులు పూర్తయిన అనంతరం రహదారి నిర్మిస్తారు.