సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : సాఫ్ట్వేర్ ఉద్యోగుల సౌకర్యం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. గత వారం జేఎన్టీయూ నుంచి వేవ్రాక్ వరకు సర్వీసును ప్రారంభించగా, సోమవారం నుంచి రిసాల్బజార్ నుంచి హైటెక్ సిటీ వరకు మరో ప్రత్యేక బస్సును ప్రారంభించనున్నారు. ఈ నాన్ ఏసీ బస్సు రిసాల్బజార్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి.. ఉదయం 10 గంటల వరకు హైటెక్సిటీకి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6 గంటలకు హైటెక్ సిటీ నుంచి బయలు దేరి రాత్రి 7-30 వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఐటీ ఉద్యోగులతో ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. 48 మంది ప్రయాణికులు ముందుకు రావడంతో ప్రత్యేక బస్సు నడిపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు.