సామాజిక కార్యకర్త దోసపాటి రాము సేవలు అభినందనీయమని బిగ్బాస్ ఫేం శివజ్యోతి అన్నారు. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన పలు కుటుంబాలను ఆదుకునేందుకు దోసపాటి రాము నాగోల్ డివిజన్ రాక్హిల్స్ కాలనీలో ప్రారంభించిన రైస్ ఏటీఎం 365 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం రైస్ ఏటీఎంను ప్రముఖ యాంకర్ శివజ్యోతి సందర్శించారు. కొన్ని రైస్ బ్యాగులు అందజేసి నిరుపేదలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహమ్మారి విజృంభణతో ఆకలితో అలమటించిన నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు ఎన్నో కుటుంబాలను ఆదుకునేందుకు కుట్టు మిషన్లు, టిఫెన్ సెంటర్లు, కొబ్బరి బోండాల షాపులు, ఇస్త్రీ, కిరాణ, పిండిగిర్నీలు అందజేసి ఉపాధి కల్పించిన దోసపాటి రాము సేవలను ఆమె కొనియాడారు. దోసపాటి రామును ఆదర్శంగా తీసుకొని మరికొందరు సమాజ సేవలో పాలుపంచుకోవాలన్నారు. సామాజిక కార్యకర్త దోసపాటి రాము మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడమే తన లక్ష్యమన్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు చదువుకునే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించామన్నారు. కార్యక్రమంలో వలంటీర్లు రాఘవేంద్ర, సైదులు, రాకేశ్, నాగేశ్, మహేశ్, నాగరాజు పాల్గొన్నారు.