సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పెట్-ఎంఆర్, ఇథోస్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను నగరంలోని ఒమెగా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని ఆ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్.మోహన వంశీ అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని ఒమెగా మల్టీస్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్లో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యాధునిక వైద్య పరికరాలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్యాన్సర్ వైద్యనిపుణులతో కలిసి డాక్టర్ మోహన వంశీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైద్యపరికరాల పనితీరు, వాటి వల్ల రోగులకు కలిగే లాభాలు, వాడుక విధానాలు తదితర అంశాలపై క్యాన్సర్ వైద్యులకు అవగాహన కల్పించారు. అనంతరం మోహన వంశీ మాట్లాడుతూ గుండె సంబంధిత, ఆర్థో, రీనల్, పల్మనరీ, న్యూరో తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చాలా మంది క్యాన్సర్ రోగులకు తరచూ సంబంధిత విభాగాలకు చెందిన వైద్యుల సూచనలు, సలహాలు అవసరం పడుతుంటాయన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ.. రోగుల కోసం ప్రత్యేకంగా మల్టీస్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేశామని తెలిపారు.
అంతేకాకుండా దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో పనిచేసే ఏ1 పవర్డ్ రేడియేషన్ అయిన ఇథోస్ థెరపీ చికిత్సా విధానం, పెట్-ఎంఆర్ గైడెడ్ అడాప్టివ్ రేడియో థెరపీతో ఇథోస్ చికిత్సా విధానాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ విధానం ప్రపంచలోనే తొలిసారిగా ఇక్కడ ప్రారంభించడం తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమన్నారు. ఈ చికిత్సా విధానాలు, ఆధునిక పరికరాలు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులుగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో ఒమేగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ నంబూరి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. నమ్రత, డాక్టర్ రవిరాజు, డాక్టర్ గణేశ్ మాథన్, డాక్టర్ విక్రమ్ శర్మ, డాక్టర్ ఆదిత్య కపూర్ తదితరులు పాల్గొన్నారు.