వ్యవసాయ యూనివర్సిటీ , జూలై 24 : దేశంలో వ్యవసాయ, అనుబంధ రంగంతోనే అధిక ఉపాధి లభిస్తున్నదని కోరమండల్ ఉపాధ్యక్షులు డా.జీవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న అగ్రి యూత్ సమ్మిట్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మన దేశంలో వ్యవసాయ రంగానికి అనుకూలమైన వనరులు ఉన్నప్పటికీ నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడిగా ఇతర దేశాల నుంచి తిండి గింజలు దిగుమతి చేసుకునే దుస్థితి నెలకొందని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో విప్లవాత్మక మార్పు వచ్చిందని తెలిపారు. తెలంగాణలో మాదిరిగానే దేశమంతటా సాగుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇక్రిషాట్ అగ్రి ఇన్నోవేషన్ హెడ్ డా.శ్రీకాంత్ రూపావతారం మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని యువతకు ఆకర్షనీయంగా మార్చడం మన ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. నవ కల్పనలు చేపట్టడంలో యువత ప్రధాన భూమిక పోషించాలని సూచించారు. కృత్రిమ మేద వినియోగంతో రైతులకు మెరుగైన సేవలు అందించగలుగుతామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యకు ఆదరణను బట్టి కళాశాలలను పెంచుతున్నామని వ్యసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.ఎం.వెంకట్మ్రణ అన్నారు. అగ్రియూత్ సమ్మిట్ను ఈ నెల 26, 28 తేదీలలో సిరిసిల్ల, జగిత్యాల కళాశాలల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 31న రాజేంద్రనగర్ వ్యవసాయ కశాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్ఏ డా.జే.సత్యనారాయణ, పాలక మండలి సభ్యులు డా.సీమ, డా.జమునారాణి, డా.నరేందర్ రెడ్డి, డా.రమేశ్ పాల్గొన్నారు.