సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టులకు భూములు తీసుకోవాలంటే, నష్టపోతున్న బాధితులకు భరోసానివ్వాలి. ప్రాజెక్టు కారణంగా భవిష్యత్లో కోల్పోయే ఆర్థిక వనరులకు ప్రత్యామ్నాయం చూపాలి. కానీ ఇవేమీ లేకుండానే ప్రాజెక్టుకు మీ భూములు పోతున్నాయి.. వాటికోసం ఆస్తి పత్రాలతో రావాలంటూ బాధితులను అధికార యంత్రాంగం వేధింపులకు గురిచేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం భూ సేకరణ వివాదం రెండేళ్లుగా సాగుతోంది.
ఇప్పటికీ భూసేకరణ విషయమై బాధితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వ యంత్రాంగం… ఆస్తులను సేకరించేందుకు మాత్రం శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఇంటింటికీ నోటీసులు జారీచేసిన యంత్రాంగం.. ఇప్పుడు ఒక్కో బాధితుడిని వ్యక్తిగతంగా సంప్రదిస్తూ ఆస్తి పత్రాలతో రావాలంటూ పిలుస్తున్నారు. అయితే ఇవ్వనున్న పరిహారం తేల్చకుండా ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కార్యాలయాలకు పిలిపించడం ఏమిటనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రాజెక్టు భూసేకరణ సమయంలోనే ప్రభావిత ఆస్తుల వివరాలను, కోల్పోయే విస్తీర్ణం వంటి అంశాలతో పబ్లిక్ నోటిఫికేషన్ను విడుదలు చేస్తారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహిస్తారు. ఇప్పటివరకు పలుమార్లు నిర్వహించిన బహిరంగ సమావేశాలు, అధికారులతో నిర్వహించిన భేటీల్లోనే బాధితులు తమ వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్టుతో సర్వం కోల్పోతున్నామని, భవిష్యత్లో ఆర్థిక అవకాశమే లేకుండా పోతుందని వాపోయారు.
అయితే బాధితుల వాదలనపై సర్కార్ స్పందించకపోవడంతో 500కు పైగా బాధితులు నేరుగా కోర్టులను ఆశ్రయించారు. అవేమీ పట్టించుకోని సర్కార్ మాత్రం ఎలాగైన భూములను సేకరించాలని చూస్తుంది. అందులో భాగంగానే పరిహారంపై అనుమానాలను నివృత్తి చేయకుండా ఇటీవల ఆస్తి పత్రాలను తీసుకుని రమ్మంటూ ఒక్కొక్కరిని సంప్రదిస్తూ భూములను సేకరించాలని చూస్తోంది. ఈనెల 19నుంచి ఒక్కో బాధితుడికి వ్యక్తిగతంగా ఆస్తి పత్రాలతో రావాలంటూ రెండు జిల్లాల యంత్రాంగం పిలవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే సర్కార్ను కలిసి తమ ఆవేదన వినిపించాలని చూస్తున్నామని రాజీవ్ రహదారి పరిరక్షణ జేఏసీ నాయకులు సతీష్ గుప్తా వివరించారు.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట్ మార్గంలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణను కాంగ్రెస్ సర్కార్ డైలీ సీరియల్ లాగా మార్చేసి.. బాధితులకు చుక్కలు చూపిస్తోంది. ప్రాజెక్టు వెడల్పు విషయంలో ఏమాత్రం రాజీ పడని ప్రభుత్వం.. కనీసం బాధితుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. దాదాపు రూ.4వేల కోట్ల అంచనా వ్యయంతో రెండేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టును సాగదీస్తూనే ఉంది. ఇప్పటివరకు గుర్తించిన వెయ్యికిపైగా ఆస్తులలో ఏ ఒక్కటి కూడా సేకరించని యంత్రాంగం.. ఎప్పటిలోగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేస్తుందో కూడా చెప్పలేని స్థితిలో ఉంది.