బన్సీలాల్పేట్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని, వారి సంస్కృతి, సంప్రదాయాలను, పర్వదినాలను ఆనందంగా జరుపుకోవడానికి తగిన ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రతి ఏటా నవంబర్ 2న జరుపుకునే ‘ఆల్ సోల్స్ డే’ (పవిత్ర ఆత్మల దినం) సందర్భంగా మంగళవారం పెద్ద ఎత్తున కైస్తవులు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి నివాళులర్పించారు. మంగళవారం న్యూబోయిగూడలోని కైస్తవుల శ్మశానవాటికలోని మేరిమాత విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
క్రిస్టియన్ శ్మశానవాటిక ఇన్చార్జి జయరాజ్, ఇతర సభ్యులు మంత్రి శ్రీనివాస్ యాదవ్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలతను శాలువాతో సన్మానించారు. శ్మశానవాటిక లోపల మౌళిక వసతులు కల్పించడం, మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయించినందుకు క్రిస్టియన్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సనత్నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో శ్మశానవాటికకు హాజరైన ప్రజలకు తాగునీరు, బిస్కెట్లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఇన్చార్జి జీ.పవన్కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.