దుండిగల్, జూలై 21 : చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఇండ్లు నీట నీటమునగడంతో శుక్రవారం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుకాల చెరువు ఎఫ్టీఎల్ను ఆక్రమించి నిర్మించుకున్న బిహార్ స్లబ్ బస్తీ నీటమునిగింది. బస్తీలో రెండు, మూడు అడుగుల మేర నీరు చేరడంతో స్థానికులను అప్రమత్తం చేసిన అధికారులు శుక్రవారం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పడవల ద్వారా సుమారు 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం బాధితులకు జడ్పీహైస్కూల్లో పునరావాసం కల్పించారు. గతంలో కొత్తకుంట ఎఫ్టీఎల్ స్థలంలో ప్లాట్లు చేసి ఇండ్లు నిర్మించడంతోనే ఈ పరిస్థితి దాపురించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరావు, గండిమైసమ్మ దుండిగల్ తాసీల్దార్ పద్మప్రియ, గిర్దావర్ భారతి, దుండిగల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐలు శ్రీనివాస్, ధనుంజయ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.