సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ అడ్వర్టయిజ్మెంట్ విభాగంలో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు ఎట్టకేలకు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి రంగంలోకి దిగారు. అనధికార ప్రకటనల అక్రమాలపై ఈ నెల 23న నమస్తే తెలంగాణలో ‘ప్రచారం దండి.. ఖజానాకు గండి’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందుకు స్పందించి రంగంలోకి దిగిన ఈవీడీఎం డైరెక్టర్ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేబీఆర్ చుట్టూ ఉన్న 80 ట్రాఫిక్ పోలీసుల గొడుగులు, 20 బస్ షెల్టర్లపై ఉన్న అక్రమ ప్రకటనలను తొలిగించారు. అంతేకాకుండా అక్రమంగా ఉన్న నాలుగు బస్ షెల్టర్లను పూర్తిగా తొలగించారు. ఇదిలా ఉంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో జీహెచ్ఎంసీలో అడ్వర్టయిజ్మెంట్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ఆధారాలతో ఎండగట్టారు. దీనిపై మేయర్ స్పందిస్తూ హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో పాటు అక్రమాలను నిగ్గు తేల్చేందుకు విచారణ అధికారిని నియమించాలని కమిషనర్ రొనాల్డ్ రాస్కు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే విచారణ అధికారి, హౌస్ కమిటీ సభ్యులు రాకముందే అనధికారిక హోర్డింగ్లను తొలగించే పనులు చేపట్టడంపై మతలబు ఏంటన్నది చర్చ జరుగుతున్నది. అలాగే డీఈఈ కార్తీక్పై విచారణకు ఆదేశించకుండా జీహెచ్ఎంసీ ఈఎన్సీకి రిపోర్టు చేయాలని బదిలీ చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. హౌస్ కమిటీలో నిజాలు బయటపడతాయని రాత్రికి రాత్రే అక్రమ బస్ షెల్టర్లను తొలగిస్తూ, సమస్యను దారి మళ్లిస్తున్నారని కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ప్రధాన రోడ్లతో పాటు ఆర్టీసీ, ప్రైవేట్ భవనాలపై ఉన్న హోర్డింగ్లను తొలగించే పనులు ఒకే కాంట్రాక్టర్కు టెండర్ పాలసీ నిబంధనలు ఉల్లంఘించి మరీ పనులు అప్పగించారన్న అరోపణలు వినిపిస్తున్నాయి.