బండ్లగూడ, మే 26: తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇటీవల 118 జీవో ద్వారా రాజేంద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ సిక్ చావానీలో నివాసముంటున్న సిక్కులకు అతి తక్కువ రుసుము గజానికి 250 రూపాయలతో వారి స్థలాలను రెగ్యులరైజ్ చేసిన విషయం విదితమే. సిక్ చావానీలో 12 వందల మంది సిక్కులు నివాసముంటున్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం 915 మంది తమ ఇంటి స్థలాల రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 726 మందికి కలెక్టర్ నుంచి అనుమతి రావడంతో శుక్రవారం 355 మందికి డీడ్ ఆఫ్ కన్వీయన్స్ కింద పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, తెలంగాణ సిక్ సొసైటీ అధ్యక్షురాలు తేజ్దీప్ కౌర్ తదితరులు పాల్గొని సిక్కులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. 1832 నుంచి సిక్కులు అత్తాపూర్ సిక్ చావానీలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారన్నారు. నాటి నుంచి అనేక ప్రభుత్వాలు పాలించినా సిక్కుల ఆవేదనను పట్టించుకోలేదని తెలిపారు. సిక్కుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ప్రత్యేక జీవో ద్వారా సిక్కులకు పట్టాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. సిక్కులు అనేక సంవత్సరాలుగా ఇండ్ల స్థలాల గురించి పోరాటం చేసినా నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రత్యేక జీవో ద్వారా సిక్కుల సమస్య పరిష్కారమయ్యిందన్నారు. ఇది ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, తాసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది, కార్పొరేటర్లు అర్చన జయప్రకాశ్, సంగీత గౌరీ శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.