Hyderabad Rains | సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ) : మండిపోయే ఎండలతో వాతావరణంలో ధూళి కణాల తీవ్రత పెరుగుతుంది. వాహనాల రాకపోకలు, నిర్మాణ పనులు, పరిశ్రమల కార్యాకలాపాల నుంచి గాలిలో దుమ్ము, ధూళి కణాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా వాహనాల రద్దీ, పారిశ్రామిక కార్యాకలాపాలతో పరిమితికి మించి పోతుంది. కానీ ఇటీవల నగరాన్ని ముంచెత్తిన అకాల వర్షాలతో నగర వాతావరణంలో గాలి నాణ్యత మెరుగుపడింది. పంటలకు నష్టం చేసేవే అయినా నగరంలో మాత్రం ఒక్కసారిగా కాలుష్య తీవ్రత 20 శాతానికి మేర తగ్గినట్లుగా పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి.
వర్షాలతో మెరుగుపడిన గాలి నాణ్యత
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో రియల్ టైం ద్వారా ఎయిర్ క్వాలిటీని సెంట్రల్, స్టేట్ పీసీబీలు పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో అన్ని ప్రాంతాల పరిధిలోనూ సాధారణ రోజుల్లో ధూళి కణాల పరిమాణం సాధారణం కంటే ఎక్కువే నమోదై ఉంటాయి. కానీ మార్చి 1-20 వరకు ఉన్న వాతావరణంతో గాలి నాణ్యత మెరుగుపడింది. సాధారణంగా 60మై.గ్రాము/క్యూ. మీను ప్రామాణికంగా తీసుకుని కాలుష్య తీవ్రతను లెక్కిస్తారు. కానీ నగరంలో ఆయా రోజుల్లో వాతావరణంలో ఒక్కసారిగా సూక్ష్మ దుమ్ము, ధూళి కణాల ప్రభావం భారీగా పడిపోయింది. ఇందులో ప్రధానంగా జూ పార్క్, సనత్ నగర్, బొల్లారం ప్రాంతాల్లో అనూహ్య రీతిలో గాలి నాణ్యత మెరుగుపడింది. ఈ నెల 20న జూ పార్క్ పరిసరాల్లో పీఎం2.5 41గా ఉండగా, 23న 38మై. గ్రా/క్యూ. మీకు తగ్గింది.
పారిశ్రామిక వాడలోనూ తగ్గిన ధూళి కణాలు
ఇక పారిశ్రామిక వాడలు, సెంట్రల్ యూనివర్సిటీ వంటి ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత మెరుగుపడినట్లుగా వెల్లడైంది. సనత్ నగర్ ఏరియాలో సాధారణ రోజుల్లో పీఎం2.5 పరిమాణం సగటున 75-80మై. గ్రా/క్యూ.మీగా ఉంటుంది. కానీ మార్చి 15-20 వరకు వానల కారణంగా కనిష్ట సగటు 34మై. గ్రా/క్యూ.మీలకు దాటలేదని తేలింది. సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో గాలి నాణ్యత మెరుగుపడి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. మార్చి 23న పీఎం2.5 స్థాయి 25 మై.గ్రాలోపే ఉండగా, మార్చి 24న 20మై.గ్రా/క్యూ.మీ పీఎం 2.5 ఉందని తేలింది.