సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఓఆర్ఆర్పై ప్రతి రోజు 1.20 లక్షల నుంచి 1.30 లక్షలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 2016 వరకు ఓఆర్ఆర్పై ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటే, గడిచిన 4-5 ఏండ్లుగా ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2016లో 110 మరణాలు నమోదుగా 2021లో మాత్రం 50లోపే ఉన్నాయి. అదే సమయంలో ఓఆర్ఆర్ ట్రాఫిక్ రెట్టింపు అయ్యింది. ప్రమాదాలను అరికట్టేందుకు హెచ్ఎండీఏ, పోలీసు శాఖ కలిసి పనిచేస్తున్నది. గతంలో ఓఆర్ఆర్పై వాహనాల వేగం గంటకు 120 కి.మీ ఉండగా, ప్రస్తుతం గంటకు 100 కి.మీల వేగంతో వెళ్లేలా చేశారు. వాహనాల వేగనియంత్రణకు స్పీడ్ గన్లను ఏర్పాటు చేశారు. వాహనాల వేగం పెరితే పోలీసులు చలాన్లు విధిస్తున్నారు.
ఔటర్పై ట్రామాకేర్ సెంటర్లు..
ఔటర్పై పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల పాటు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ఇంటర్చేంజ్ల వద్ద గతేడాది 10 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తే, ఈ ఏడాది నవంబర్నాటికి మరో 6 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 16 ట్రామాకేర్ సెంటర్లతో పాటు 10 అంబులెన్స్లు (అడ్వాన్డ్ లైఫ్ ససోర్టు ఓఆర్ఆర్ మీదే అందుబాటులో ఉండి, ప్రమాదం జరిగిందని 1066కు సమాచారం వచ్చిన 5 -10 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సను అందిస్తున్నారు. వైద్య సేవలను అందించడంలో అపోలో, యశోద ఆస్పత్రులు సహకారం అందిస్తున్నాయి. 13 నెలల్లో మొత్తం 1084 మందికి ట్రామా కేర్ సెంటర్ల ద్వారా ప్రాథమిక చికిత్సను అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా 375మంది ప్రాణాలను కాపాడారు. మరో 217 మందికి ప్రాథమిక చికిత్స అందించి ఇతర ఆస్పత్రులకు తరలించారు. అదేవిధంగా ప్రాథమిక చికిత్స అందించి 233 మందిని డిశ్చార్జి చేశారు. వీటితో పాటు సంఘటనాస్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి ఆస్పత్రులకు 259 మందిని తరలించారు. ట్రామా కేర్ సెంటర్లో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండడంతో పాటు, అత్యవసరమైతే టెలి మెడిసిన్ సదుపాయం కూడా ఉంది.
అతి వేగం నియంత్రిస్తాం..
ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ప్రమాదాలకు కారణాలను పరిశీలిస్తే అతి వేగం వల్ల జరిగినవే అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత డ్రైవర్ల నిద్రమత్తు వల్ల జరిగివి ఉన్నాయి. అతి వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశాం. తాజాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక వాహనం ఓఆర్ఆర్ పైకి వచ్చిన ఇంటర్చేంజ్ నుంచి మళ్లీ కిందకు వచ్చే ఇంటర్ చేంజ్ వరకు ఉన్న దూరాన్ని పరిగణలోకి తీసుకొని ఆ వాహనం వేగాన్ని లెక్కించి, నియంత్రిత వేగమైన గంటకు 100 కి.మీకు మించి ప్రయాణం చేస్తే జరిమానా విధించేలా పోలీసు శాఖతో చర్చిస్తున్నాం. జనవరి రెండో వారం నుంచి అమలు చేసే ప్రతిపాదనను రూపొందించాం.
ఓఆర్ఆర్పై 16 చోట్ల ట్రామా కేర్ సెంటర్లు..