పహాడీషరీఫ్, జూన్ 21: నిరుపేదలు కష్టపడి కట్టుకున్న ఇళ్లకు సంబంధించి ఒక్క గజం కూడా వదులుకునేది లేదని, వ్యవస్థల పేరుతో ఇష్టారాజ్యంగా ఇండ్ల ను కూలుస్తామంటే ప్రభుత్వంపై న్యాయం పోరాటం చేస్తామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గంలోని షాహిన్నగర్లో హైడ్రా బాధితులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై బాధితులకు భరోసా కల్పించారు.
ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన తర్వాతే కొనుగోళ్లు జరిపి ఇంటి నిర్మాణాలు చేపట్టామని, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నామని.. అయితే ఇప్పుడు హైడ్రా, ఇరిగేషన్ శాఖల పేరుతో ఆయా నిర్మాణాలు అక్రమంటూ కూల్చివేసేందుకు చూస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కుబా కాలనీలో నివసిస్తున్న వారిని ఎర్రకుంట ప్రాంతవాసులుగా గుర్తిస్తూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఇప్పు డు ఎఫ్టీఎల్ పేరుతో తమ నిర్మాణాలను అక్రమం అని చెప్పి కూల్చివేసేందుకు చూస్తున్నారని.. ఈ క్రమంలోనే దాదాపు 200 ఇండ్లకు పైగా హైడ్రా మార్కింగ్ చేసిందని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం..
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ..నిరుపేదల స్థలాలు, ఇండ్ల విషయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. మార్కింగ్ వేసినంత మాత్రాన ప్రజలు భయపడవద్దని, అవసరమైతే శాసనసభలో ఈ విషయాన్ని చర్చిస్తామని తెలిపారు. స్థానికుల్లో చాలా మంది ప్రభుత్వం నుంచి ఎన్వోసీ, ఎల్ఆర్ఎస్ అనుమతులు పొంది ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తెలిపారు. నిర్భంద నోటీసులు జారీచేయాలని చూస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. నగరం చుట్టూ ఉన్న చెరువుల్లోని ఎఫ్టీఎల్ పరిధిల్లో అనేక వెంచర్లు కొనసాగుతున్నా పట్టించుకోని అధికారులు.. దాదాపు 25 ఏండ్ల కిందట ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నవారికి నోటీసులు జారీ చేయడం వింతగా ఉందన్నారు.
మాకు న్యాయం చేయాలి
రెవెన్యూ, మున్సిపల్ అనుమతులతోనే పదేండ్ల కిందట స్థలం కొనడంతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టాం. ప్రభుత్వానికి మున్సిపల్ ట్యాక్స్, విద్యుత్, వాటర్ బిల్ అన్నీ చెల్లిస్తున్నాం. అయినా ఇప్పుడు వచ్చి చెరువు శిఖం భూమి అంటూ నోటీసులు జారీ చేశారు. పేదలను కావాలనే వేధిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి.
– సఫియా ఫాతిమా, కుబాకాలనీ
అధికారులపై చర్యలు తీసుకోవాలి
కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇండ్లను కూలుస్తామంటే ఎక్కడికి వెళ్లాలి. 25 ఏండ్ల తర్వాత అధికారులు వచ్చి నోటీసులు ఇవ్వడం ఏంటి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు వెంచర్లు, స్థలాలకు అనుమతులు ఇవ్వడం అధికారుల తప్పిదమే. నిర్మాణాలకు అనుమతులు జారీచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
– బదర్ భాయ్, కుబాకాలనీ