సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ ) : కరో నా సెకండ్ వేవ్లోనూ నిర్మాణ రంగ అనుమతుల జోరు కొనసాగింది. భవన, లే అవుట్ నిర్మాణాలకు అవసరమైన పర్మిషన్ల కోసం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి. కరోనా తీవ్రంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లోనూ వేల సంఖ్యలో ఇండ్లకు అనుమతులు లభించాయి. సుమారు రెండు నెలల కాలంలో హెచ్ఎండీఏ పరిధిలో అన్ని రకాలకు సంబంధించి 9404, జీహెచ్ఎంసీ పరిధిలో 2155 అనుమతులు అధికారులు మంజూరు చేశారు. లాక్డౌన్ నుంచి నిర్మాణ రంగానికి మినహాయింపు ఇవ్వడం, ఆన్లైన్ విధానంతో ప్రక్రియ సజావుగా సాగిందని అధికారులు పేర్కొన్నారు.
ప్రధానంగా 76 నుంచి 600 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు అత్యధిక అనుమతులు లభిస్తున్నాయి. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవనం ప్లాన్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే.. ఆమోదం (ఇన్స్టంట్ అఫ్రూవల్) లభిస్తున్నది. ఇలా స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి పొందిన స్థలాలను పరిశీలించేందుకు జోనల్ స్థాయిలో ప్రత్యేకంగా నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ పోస్ట్ వెరిఫికేషన్ జరుపుతున్నది. 21 రోజుల వ్యవధిలోనే పర్మిషన్లు లభిస్తుండటం గమనార్హం.