కరోనా సమయంలోనూ రియల్ రంగం మెరుగైన ఫలితాలు సాధించింది. పనులులేక సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆదాయ మార్గాలు గణనీయంగా తగ్గినప్పటికీ రియల్ రంగం మాత్రం కొంత వరకు ఊపిరి పీల్చుకున్నది. 2020 మార్చి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగినప్పటికీ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు 1,68,372 రిజిస్ట్రేషన్లు నమోదు కావడం విశేషం. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా.. 1,545 కోట్ల ఆదాయం సమకూరిందని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ స్థితప్రజ్ఞ తెలిపారు.
కరోనా నేపథ్యంలో మధ్యలో మూడు నెలలకు పైగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఈ ఏడాది జనవరి నుంచి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో గత జనవరిలో ఊహించని స్థాయిలో ఆస్తుల క్రయ విక్రయాలు జరిగాయి. మూడు నెలల విరామం తర్వాత జనవరిలో 30,947 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా రూ.290.47 కోట్ల రాబడి వచ్చింది. అదేవిధంగా ఫిబ్రవరిలో అదేజోరు కొనసాగింది. 27,096 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా రూ. 256.35 కోట్ల వరకు రాబడి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో కూడా 28,503 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా రూ.276.60 కోట్ల వరకు ఆదాయం రావడం విశేషం.
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం మంచి జోరు మీద కొనసాగుతున్నది. ఆస్తుల క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. నగర శివారు ప్రాంతాలలో అపార్టుమెంట్ సంస్కృతి బాగా పెరిగింది. అన్ని అనుమతులు పొందిన తర్వాతే బిల్డర్లు అపార్టుమెంట్లు కడుతున్నారు. దీంతో కొనుగోలు దారులు కూడా అన్ని అనుమతులు ఉన్న వాటికే మొగ్గుచూపుతున్నారు. వాటిలో బ్యాంకు లోన్లు వస్తున్నాయి. దీంతో మధ్య తరగతి వారు, చిరు ఉద్యోగులు కూడా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటున్నారు. అందుకోసం బ్యాంకర్లు కూడా సహకరిస్తున్నారు. ఈ ప్రభావంతో నగరం పరిధిలో రిజిస్ట్రేషన్లు విరివిగా జరుగుతున్నాయని సంబంధిత జిల్లాల అధికారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానం సులభతరం చేయడంతో రిజిస్ట్రేషన్లు పెరుగడానికి మరో కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రానున్న కాలంలో రియల్ రంగం జోరు కొనసాగుతూనే ఉంటుందని, ప్రభుత్వానికి రాబడి పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.