ఇబ్రహీంపట్నం, జనవరి 16: పుస్తకాలను దూరం పెడుతూ.. సెల్ఫోన్లకు దగ్గరవుతున్న విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేస్తున్నది. మొదటి దశలో రంగారెడ్డి జిల్లాలోని 148 ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 3000లకు పైగా ప్రభుత్వ పాఠశాలలుండగా, మొదటి విడుతలో 148 పాఠశాలలను ఎంపికచేశారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రీడింగ్ కార్నర్లను నెలకొల్పేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రీడింగ్ కార్నర్ నిర్వహణ బాధ్యతలను పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడికి అప్పగించారు. శిక్షణ పొందిన ఈ ఉపాధ్యాయుడు విద్యార్థులను రీడింగ్ కార్నర్స్కు రప్పించాల్సి ఉంటుంది.
250 రకాల పుస్తకాలు..
రీడింగ్ కార్నర్లలో 250 రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో దేశభక్తి, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు ఎక్కువగా ఉండనున్నాయి. ఈ పుస్తకాలను ప్రభుత్వమే సమకూర్చనున్నది. మరో రెండు మూడు రోజుల్లో విద్యాశాఖ నుంచి ఈ పుస్తకాలు రీడింగ్ కార్నర్లకు రానున్నాయి. మరో వారం రోజుల్లో వీటిని ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇన్చార్జిలకు శిక్షణ పూర్తి..
విద్యార్థి దశ నుంచే పుస్తకాలు చదివే అలవాటు చేసేందుకు ప్రభుత్వం రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం జిల్లాలోని 148 పాఠశాలలను ఎంపిక చేశాం. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రీడింగ్ కార్నర్ల నిర్వహణను సంబంధిత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడికి అప్పగించాం.
– డీఈఓ సుశీందర్రావు, రంగారెడ్డి జిల్లా
విద్యార్థులకు వరం..
రీడింగ్ కార్నర్లు విద్యార్థులకు వరంగా మారనున్నాయి. విద్యార్థులకు క్రమంగా పుస్తకపఠనానికి దూరమవుతున్న తరుణంలో ప్రభుత్వం రీడింగ్ రూంలను ఏర్పాటు చేయడం శుభసూచకం. ఈ పుస్తకాలు విద్యార్థులకు మంచి భవిష్యత్ను ఇస్తాయనడంలో సందేహం లేదు.
– వర్కాల పరమేష్, ప్రధానోపాధ్యాయుడు.