హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులగణననూ చేపట్టాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆర్డీసీ) చైర్మన్ మెట్టు శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 90 ఏండ్లుగా బీసీ కులగణన జరుగలేదన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలకులు 1871 నుంచి 1931 వరకు 16 సార్లు కులగణన చేశారని, ఆ కాలంలోనే సాధ్యమైన కులగణన ఇప్పుడెందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మోదీ ప్రధానిగా అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేస్తామని చెప్పారని.. కానీ బీసీ కులగణన ఉండబోదంటూ 2021లో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారని తెలిపారు. మోదీ సర్కారు బీసీలను మోసం చేసిందని విమర్శించారు.
బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర కుటుంబసర్వే చేయించారని.. వివరాలను క్రోడీకరించుకొని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నారని శ్రీనివాస్ వివరించారు. బీసీ వర్గాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రం వెంటనే ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని మెట్టు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.