సిటీబ్యూరో/మేడ్చల్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం నుండి ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా కొత్తకార్డులు పొందిన వారికి కూడా 10 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నది. హైదరాబాద్ జిల్లాలోని తొమ్మిది సర్కిళ్లలో మొత్తం 5.80 లక్షల తెల్ల రేషన్ కార్డులుండగా… కొత్తగా మరో 56,064 కార్డులు మంజూరయ్యాయి. పాత కార్డుల వల్ల 21,90,034 మందికి, కొత్త వాటి వల్ల 2,25 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నది.
మేడ్చల్ జిల్లా పరిధిలో 4,94,609 తెల్ల రేషన్ కార్డులుండగా.. ఇటీవల 30,055 కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో మొత్తంగా 5,24,664 రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం అందిచేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలో 636 రేషన్ షాపులుండగా.. 4,94,609 కార్డులకు 21,220.090 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేవారు. ఇప్పుడు కొత్త కార్డులకు అవసరమైన మరిన్ని మెట్రిక్ టన్నుల బియ్యం సమకూర్చి పంపిణీ చేయనున్నట్లు డీఎస్వో పద్మ తెలిపారు.