రామప్ప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కడంతో అందరి దృష్టి ఈ ఆలయం వైపు మళ్లింది. ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన ఈ దేవాలయంలోని కళా వైభవాన్ని అప్పట్లో ప్రముఖ చిత్రకారుడు, దివంగత కొండపల్లి శేషగిరిరావు రేఖా చిత్రాల మాధ్యమంలో గీసిన చిత్రాలు ఇప్పుడు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
1940లోనే ఆయన రేఖా చిత్రాల ద్వారా ఈ అద్భుత కళాఖండాన్ని పదిలం చేశారు. అక్కడి శిల్పాలను రేఖా చిత్రాల ద్వారా భవిష్యత్తరాలకు అందించిన ఆయన వరంగల్ జిల్లా మానుకోట మండలం, పెనుగొండ గ్రామ వాసి కావడం విశేషం. రామప్ప ఆలయానికి ప్రత్యేకత తెచ్చే చిత్రాలను గీయడమే కాకుండా కాకతీయ కళ, నా అనుభవం పేరిట రాసిన వ్యాసంలో రామప్ప శిల్పాలకున్న ప్రత్యేకతలను వివరించారు. కాకతీయ శిల్పాలు నాలుగు రకాలుగా ఉన్నాయని, దేవతామూర్తులు, నాట్య భంగిమలు, నరనారీ మూర్తులు, అలంకార రూపాలు బౌద్ధ, చోళ, చాళుక్య, హోయసల శిల్ప ప్రభావాలు కాకతీయ శిల్పంలో ప్రతిబింబిస్తాయన్నారు. కాకతీయ శిల్పంలో కదలిక ఎక్కువ అని అభిప్రాయపడ్డారు.
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంతో తెలంగాణ ఘనత విశ్వవ్యాప్తమైందని రాష్ట్ర దేవాదాయ శాఖ అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీసర్ డీవీఆర్ శర్మ పేర్కొన్నారు. ఆలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి, అధికారులు, నాయకులకు సోమవారం ఒక ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. రామప్ప ఆలయం ద్వారా హిందూ దేవాలయ వ్యవస్థ ఎంతటి ప్రాచీనమైనదో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.