Ramadan | “శరీరాన్ని కాదు పాపాన్ని శుష్కింపజేసుకోవాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం..” ఇదే రంజాన్ ఇచ్చే సందేశం. నగరంలో గురువారం రంజాన్ వేడుకలు జరుగనున్నాయి. శాంతి పూర్వక వాతావరణంలో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. చార్మినార్, సికింద్రాబాద్, బహదూపుర, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో రంజాన్ శోభ సంతరించుకున్నది.
గురువారం ముస్లిం సోదరులు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తిప్రవత్తులతో జరుపుకుంటారు. ముస్లింలు తమ ఇంట్లో పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ తీపి వంటలను హిందువులు, పేద ప్రజలకు పంపిణీ చేస్తారు. కొత్త బట్టలు ధరించి నమాజ్ను చేస్తారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటూ ఈద్ముబారక్ తెలుపుకుంటారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ)