కాచిగూడ, మార్చి 12: ప్రధానమంత్రి మోదీ భారతదేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెడుతున్నాడని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు. జాతీయ కన్వీనర్ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలోని ఓ హోటల్లో వివిధ రాష్ర్టాల నాయకులతో అభిలపక్ష సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పలు రాష్ర్టాల నాయకులతో ఏప్రిల్ 3వ తేదీన బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి వేలాది మందితో పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సంపన్న వర్గాలకే ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నాడని ఆరోపించారు. అనంతరం చలో ఢిల్లీ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్, అంజి, నందగోపాల్, భూపేశ్సాగర్, రాజ్కుమార్, సి.రాజేందర్, అనంతయ్య,వీరన్న తదితరులు పాల్గొన్నారు.