హైదరాబాద్ : ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 8 గంటల వరకు మంచు కురియడంతో భాగ్యనగరం వాతావరణం కశ్మీర్ను తలపిస్తోంది. మొన్నటి వరకు ఆగ్నేయం వైపు నుంచి గాలులు వీయడంతో మబ్బులు ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండలు దంచికొట్టిన విషయం తెలిసిందే.
అయితే గడిచిన రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈశాన్యం వైపు నుంచి చల్లటి గాలులు వీస్తుండడంతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే దిగువకు పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో శుక్రవారం గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిసాయి. తెల్లవారుజాము నుంచి దాదాపు ఉదయం 8 గంటల వరకు నగరం మంచు దుప్పటి కప్పుకున్న చందంగా తలపించింది.
రాగల మరో రెండు రోజులు ఈ గాలులు వీచే అవకాశం ఉండడంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.