హైదరాబాద్ : గురువారం ఉదయం హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. గాలులకు తోడు చిరుజల్లులు కురియడంతో వాతావరణం మరింత చల్లబడింది.
చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదుర్పురా, యాకుత్పురా, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్పురా, బండ్లగూడ, గండిపేట్, శంషాబాద్, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాగూడ, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, సికింద్రాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్తో పాటు పలు ఏరియాల్లో వర్షం కురిసింది.
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన విషయం విదితమే. ఈ నెల 16 వరకు వానలు పడొచ్చని సూచించారు. ఉత్తర కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉన్న ఉపరితల ద్రోణి బుధవారం దక్షిణ కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నదని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు.
రాష్ట్రంలో నిన్న కురిసిన వడగండ్ల వాన రైతన్నలను ముంచేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిర్చి, మక్కజొన్న, పల్లి, మినుము, పెసర, ఆవాలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల దాటికి మిర్చి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాలిన మిర్చి వరదలో కొట్టుకుపోయింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. వరంగల్ జిల్లాలోని 191 గ్రామాల్లో 26,086 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇటుకాలపల్లి, నర్సింగాపూర్లో 17 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏటి చెక్డ్యామ్ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మిర్చియార్డులో పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. కల్లాల్లో ఉన్న మిర్చి తడవకుండా రైతులు అష్టకష్టాలు పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలుచోట్ల తీసేదశలో ఉన్న పత్తి తడిసింది.