సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): రుతుపవనాలకు తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో గత మూడు రోజులుగా ముసురు వస్తున్నది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండటంతో నగరం తడిసి ముద్దయింది. రాత్రి 10 గంటల వరకు నగరంలోని టోలిచౌకిలో 3.30 సెం.మీ, లంగర్హౌస్లో 2.30సెం.మీ, మియాపూర్, జూబ్లీహిల్స్లో 2.20 సెం.మీ, బంజారాహిల్స్లో 2.18 సెం.మీ, షేక్పేటలో 2.13 సెం.మీ, యూసుఫ్గూడ, కృష్ణానగర్లో 2.05 సెం.మీ, గచ్చిబౌలిలో 1.80 సెం.మీ, నాంపల్లిలో 1.73 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
రుతుపవనాలకు తోడు ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నటు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.9 డిగ్రీలు, గాలిలో తేమ 95 శాతంగా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.