సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : ఉత్తర ద్రోణి ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిసాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలి, ఖాజాగూడలో అత్యధికంగా 1.3సెం.మీ., మాదాపూర్లో 1.0 సెం.మీ., గాజులరామారంలో 0.6 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కిందిస్థాయి గాలుల ప్రభావంతో ఎండలు సైతం దంచికొడుతున్నాయి. బుధవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.4 డిగ్రీలు, గాలిలో తేమ 43 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజులు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.