హైదరాబాద్ : ఈ-మొబిలిటీని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 30 రైల్వే స్టేషన్లలో ఈ-వెహికల్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో రైల్వే స్టేషన్లలో వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రయాణీకులకు అదనపు సౌకర్యాలను సమకూరుస్తాయి. రైల్వేల్లో తొలిసారిగా సికింద్రాబాద్ డివిజన్ తన పరిధిలోని 32 స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానుంది.
నాంపల్లి స్టేషన్లో తొలుత ఈ-వెహికల్ చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు కీలక సదుపాయాన్ని అందించడంతో పాటు ఈ ప్రక్రియ రైల్వేలకు ఆదాయ వనరుగానూ మారనుంది. పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల సికింద్రాబాద్ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జ్) అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు.
ప్రజా రవణాలో గ్రీన్ ఎన్విరాన్మెంట్, క్లీన్ ఎనర్జీ దిశగా ఇది కీలక అడుగని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్, సంజీవయ్య పార్క్, లక్డీకాపూల్, నెక్లెస్రోడ్, వికారాబాద్, ఫతేనగర్, కాజీపేట్, వరంగల్, బేగంపేట్, హైటెక్ సిటీ, ఘట్కేసర్, బెల్లంపల్లి, భద్రాచలం రోడ్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, డోర్నకల్, పెద్దపల్లి, తాండూర్, కరీంనగర్ వంటి 30 రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.