వరల్డ్ హెడ్ ఇంజ్యూరీ అవేర్నెస్ డేను పురస్కరించుకుని ఎల్బీనగర్ కామినేని దవాఖానలోని ఇందిరా ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పోలీసు సిబ్బందికి హెడ్ ఇంజ్యూరీ, కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై అవగాహన కల్పిస్తున్న అధికారులు
మన్సూరాబాద్, మార్చి 20 : రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైతే గంటలోపు సరియైన చికిత్స అందజేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని రాచకొండ పోలీస్ కమిషనర్ సీపీ డీఎస్ చౌహాన్ అన్నారు. ప్రపంచ హెడ్ ఇంజ్యూరి అవేర్నెస్ డేను పురస్కరించుకొని ఎల్బీనగర్ కామినేని దవాఖానలోని ఇందిరా ఆడిటోరియంలో సోమవారం హెడ్ ఇంజ్యూరి, కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు.
తలకు గాయమైన వెంటనే ఎలా వ్యవహరించాలి, అత్యవసర పరిస్థితుల్లో కార్డియో పల్మనరీ రిససిటేషన్ ఏ విధంగా చేయాలనే దానిపై కామినేని వైద్య సిబ్బంది పోలీసులకు ప్రాక్టికల్గా చేసి చూపారు. చాతి కుదింపులు, రెస్క్యూ శ్వాస సహా ఇతర అంశాలను చేసి చూపారు. తలకు అయ్యే గాయాలు, వాటిలో రకాలు, కారణాలు, సంకేతాలు, లక్షణాలు, తగిన స్పందన, చికిత్స వంటి అంశాలను పోలీసు సిబ్బందికి డాక్టర్లు సమగ్రంగా వివరించారు. సీపీ డీఎస్ చౌహాన్, కామినేని హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ గాయత్రి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ పోలీసులు, డాక్టర్లు సమన్వయంతో పనిచేస్తే సమాజం ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని తెలిపారు. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించవచ్చునని అన్నారు. కామినేని హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రతి పది నిమిషాలకు ఒక్కరు చొప్పున తలకు తగిలిన తీవ్ర గాయాలతో మృతి చెందుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన గంట లోపు బాధితుడిని సమీప ఆస్పత్రికి చేర్చాలని.. గోల్డెన్ అవర్లో చేర్చడం వలన ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ శశిధర్, ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.