సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బినామీ వ్యక్తులతో వాటిని అమాయకులకు కట్టబెట్టడం, గొడవలు సృష్టించి అసలైన యజమానుల వద్ద సెటిల్మెంట్లు చేసుకుంటున్న ఓ ఘరానా ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి రూ. 4 కోట్ల విలువైన నాలుగు ప్లాట్లకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అంతా పాత నేరస్తులే..
రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అయిన మన్సూరాబాద్ నివాసి నకిరేకంటి సందీప్కుమార్ అలియాస్ రిషి కుమార్, పెద్దఅంబర్పేటకు చెందిన కంచనపల్లి అజయ్కుమార్, హిమపురికాలనీకి చెందిన నతి చంద్రశేఖర్, మాదాపూర్కు చెందిన నెమలిపురి తరుణ్కుమార్, మలక్పేటకు చెందిన బొమ్మ రామారావుపై గతంలో ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీ కేసులు ఉన్నాయి. ప్లాట్లు చాలా కాలంగా ఖాళీగా ఉండి.. యజమానుల పర్యవేక్షణ లేని వాటిని గుర్తిస్తారు. ఆయా ప్లాట్ల డాక్యుమెంట్లపై ఫొటోలు లేని, 20 ఏండ్ల కిందట రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను లక్ష్యంగా చేసుకుంటారు. ఆయా ప్లాట్లకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్టిఫైడ్ కాపీ తీసుకుంటారు. అలాంటి వాటికి సంబంధించిన పాత బాండ్ పేపర్లు, నకిలీ రబ్బర్ స్టాంపులు, సీల్స్తో సర్టిఫైడ్ కాపీలను ఆసరాగా చేసుకొని నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తారు. వాటిలో ఉండే యజమాని పేరుకు తగ్గట్టుగా ఒక వ్యక్తిని తయారు చేసి, అతడి ఆధార్కార్డులో పేరు మార్చేస్తారు. ఈ నకిలీ డాక్యుమెంట్లతో ఆయా ప్లాట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తారు. కొనుగోలు చేసేవారు ముందుకొస్తే నకిలీ వ్యక్తిని ముందు పెట్టి.. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. మరోపక్క కొన్ని ప్లాట్ల వద్దకు వెళ్లి.. అది మాదంటూ గొడవ సృష్టిస్తారు. చివరకు యజమాని దిగి వచ్చి సెటిల్మెంట్ చేసుకునే వరకు వేధిస్తూనే ఉంటారు.
ఇలా చిక్కారు…
పసుమాముల గ్రామ పరిధిలో అంతటి నాగార్జునకు చెందిన 150 గజాల స్థలానికి సంబంధించి ఇటీవల సందీప్కుమార్, అజయ్కుమార్, చంద్రశేఖర్, తరుణ్, బొమ్మ రామారావు వచ్చి ప్లాట్ నంబర్, ఇతర వివరాలు తీసుకెళ్లారు. ఈ ప్లాటుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి.. విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ప్లాట్ యజమానులకు విషయం తెలిసింది. దీంతో, హయత్నగర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం, హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితులంతా పాత నేరస్తులని దర్యాప్తులో తేలడంతో.. ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో మంగళవారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల వద్ద మరిన్ని ప్లాట్లకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు లభించాయి. దీంతో ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
యజమానులు సంప్రదించండి..
పెద్ద అంబర్పేట సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయం(ఎస్ఆర్ఓ) పరిధిలోని వనస్థలిపురం, సాహెబ్నగర్లో 201/3 సర్వే నంబర్లోని 275 గజాల (డాక్యుమెంట్ నంబర్ – 7033/1983) ప్లాట్కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్ పోలీసులకు లభించింది.