సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకల్లో అవుట్ డోర్ ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని పబ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్, వైన్ షాప్, ఈవెంట్ నిర్వాహకులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరు బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. ట్రాఫిక్, ఎస్వోటీ, పెట్రోలింగ్ బృందాలతో పాటు మహిళలపై వేధింపులు నిరోధించేందుకు షీ టీమ్ బృందాలు కూడా విధి నిర్వహణలో ఉంటాయని తెలిపారు.
వేడుకల్లో డ్రగ్స్ వినియోగానికి తావు లేకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయానికి అన్ని మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే ఆయా దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల పార్కింగ్కు సరైన ఏర్పాట్లు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు విస్తృతంగా ఉంటాయని, నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడుపొద్దని, తాత్కాలికంగా ఫ్లై ఓవర్లు మూసివేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజేశ్ చంద్ర, శ్రీనివాస్, సాయి శ్రీ, జానకి, ఇందిరా గిరిధర్, మురళీధర్, అధికారులు పాల్గొన్నారు.