హైదరాబాద్: నగరంలోని నాగోల్లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు బాధితులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరామర్శించారు. నాగోల్లోని సుప్రజ దవాఖానలో చికిత్స పొందుతన్న కళ్యాణ్ చౌదరి, సుఖ్ దేవ్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరికి సర్జరీ పూర్తి చేసినట్లు వైద్యులు సీపీకి తెలిపారు. కాల్పుల ఘటన గురించి భాదితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో నగల షాపులో కాల్పులు జరిగాయన్నారు. వెంటనే తమ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.
నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తుందన్నారు. బంగారం బ్యాగ్తో పరారయ్యేందుకు దుండగులు యత్నించారని, అయితే వారిని షాపు యజమాని, బంగారం సప్లయర్ అడ్డుకున్నారని చెప్పారు. దీంతో ఇద్దరిపై నిందితులు కాల్పులు జరిపారని సీపీ వెల్లడించారు. 2018లో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో దోపిడీ జరిగిందన్నారు. ఆ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఆ ముఠాకు చెందిన వారెవరైనా ఈ దొంగతనానికి పాల్పడ్డారా అనేదానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.
కాగా, ముందుగా రెక్కి నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రెండు కిలోల బంగారం, రూ.1.70 లక్షల నగదుతో దుండగులు పరారయ్యారని అధికారులు తెలిపారు. దోపిడీకి నంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడినట్లు చెప్పారు. సీసీ, కెమెరాలు ఫుటేజ్ ఆధారంగా రాచకొండ ఎస్వోటీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.