హైదరాబాద్ : కరోనా మహమ్మారి సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి పోలీసులు సమాజానికి ఏదో రూపంలో సేవ చేస్తూనే ఉన్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. శనివారం ప్రాణ వాయు సేవ, ప్లాస్మా డోనేషన్ వెబ్పేజీ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడారు. అవసరార్థులకు ఆహారం అందించడమైతేనేమి, ఉచిత క్యాబ్ సర్వీసెస్, ఉచిత అంబులెన్స్ సేవలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను దత్తత తీసుకోవడం ఇలా సాధ్యమైన ప్రతీది పోలీసులు చేస్తున్నారన్నారు. రాచకొండ పోలీసులు 77 మంది ఇప్పటి వరకు ప్లాస్మాను దానం చేశారన్నారు.
కొవిడ్ కంట్రోల్ రూమ్కి వచ్చే అభ్యర్థనలలో 70 శాతం ప్లాస్మా కోసం ఉంటున్నాయన్నారు. రాచకొండ పోలీసులు వీలైనంత సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కాగా ఎక్కువ మంది దాతలు ముందుకు వస్తేనే భారీ డిమాండ్ను తీర్చవచ్చని పేర్కొన్నారు. అందుకే రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో https://donateplasma.rksc.in, వెబ్పేజీని ప్రారంభించినట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఇందులో నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఆక్సిజన్ అవసరమైన వారు 9490617234 రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి, సరైన పత్రాలను అప్లోడ్ చేసి పరిమిత కాలానికి సిలిండర్లను పొందవచ్చని పేర్కొన్నారు.