సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పోలీసు విధులు సవాళ్లతో కూడుకున్నవని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శిక్షణలో ఉన్న 19 మంది ఐపీఎస్ అధికారులు మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ప్రజాక్షేమం, సమాజంలో నేర నియంత్రణ, నిరంతరం ప్రశాంతమైన వాతావరణం ఉండేలా పనిచేయాలని అన్నారు.
శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులు నిత్యం పోలీస్ స్టేషన్లలో సిబ్బంది నిర్వహించే వివిధ రకాల బాధ్యతలతోపాటు ఠాణాలకు వస్తున్న ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించాలన్నారు. స్టేషన్లలో అధికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు అందరితో స్వయంగా మాట్లాడి విధులను తెలుసుకోవాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని అన్నారు. సీసీ కెమెరాల సహాయంతో కేసుల దర్యాప్తులో వేగం పెరిగిందని తెలిపారు.
మహిళా రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ వ్యవస్థను, వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్పై ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ వివరాలను యువ ఐపీఎస్లకు వివరించారు. ఈ సమావేశంలో అడ్మిన్ డీసీపీలు ఇందిరా, నర్మదా, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.