సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణాలకు సంబంధించి ఎక్కడైనా బ్లాస్టింగ్ అవసరమైతే తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. అనుమతి లేకుండా జిలిటెన్ స్టిక్స్, డిటోనెటర్స్తో పేలుళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. సైలెంట్ బ్లాసింగ్ అనుమతి తీసుకొని జిలెటన్ స్టిక్స్తో పేలుళ్లకు పాల్పడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
యాదగిరిగుట్ట పోలీసులు సన్నిది హోటల్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టగా.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వినోద్ అనే వ్యక్తి పట్టుబడ్డాడని, అతడిని తనిఖీ చేయగా ఆరు జిలెటన్ స్టిక్స్, ఐదు డిటోనేటర్స్ లభించాయని సీపీ తెలిపారు. విచారణలో అతడికి రాయగిరి గ్రామానికి చెందిన శివరాత్రి మహేశ్ విక్రయించినట్టు చెప్పాడని, మహేశ్ ఇంట్లో తనిఖీ చేయగా 239 జిలెటెన్ స్టిక్స్, 666 డిటోనేటర్లు లభించాయని సీపీ తెలిపారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
బీహార్కు చెందిన లాలూ దాస్ చౌటుప్పల్ ప్రాంతంలో నివసిస్తూ కూలీ పనులు చేస్తున్నాడు. బీహార్ నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకొచ్చి.. చౌటుప్పల్, ఆ పరిసరాల్లో విక్రయిస్తున్నాడు. గురువారం రాత్రి బస్స్టాండ్లో చౌటుప్పల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. నిందితుడి వద్ద మూడు కిలోల గంజాయి పట్టుబడింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.