ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 11 : ర్యాగింగ్ రహిత క్యాంపస్గా అనురాగ్ యూనివర్సిటీ ఆదర్శం కావాలని రాచకొండ సీపీ డీఎస్.చౌహాన్ తెలిపారు. మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో ర్యాగింగ్, డ్రగ్స్ నివారణపై శుక్రవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో రాచకొండ సీపీ చౌహాన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ చౌహాన్ మాట్లాడుతూ..ఈవ్టీజింగ్, ర్యాగింగ్ ద్వారా ఇతర విద్యార్థులను వేధించే ముందు తమను ఎవరైనా వేధిస్తే ఎలా ఉంటుందో విద్యార్థులు ఊహించుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ జూనియర్లను స్నేహితులుగా భావించి వారికి అండగా ఉండాలని, వారికి సహకరించి ప్రోత్సహించాలని తెలిపారు. ర్యాగింగ్లకు పాల్పడే వారిపై ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు, యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకానికి విద్యార్థులు ఆకర్షితులు కావొద్దని, డ్రగ్స్ వాడటం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడు చేస్తుందన్నారు. మత్తు పదార్థాల రవాణాపై ఎన్నో దాడులు చేస్తున్నామని, ఎంతో మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ర్యాగింగ్ వంటి హీనమైన చర్యలకు దూరంగా ఉండాలని, తమ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం కొరకు యూనివర్సిటీని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్యార్థుల దృష్టి నిరంతరం తమ కెరీర్పై మాత్రమే ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్ రెడ్డి, యూనివర్సిటీ సీఈవో సూర్యదేవర నీలిమ, పోచారం ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి, రిజిస్ట్రార్ బాలాజీ, అడ్మిన్ డైరెక్టర్ శ్రీనివాస్రావు, విద్యార్థులు పాల్గొన్నారు.