ఘట్కేసర్ రూరల్ / మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 19 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సూచించారు. మండల పరిధిలోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద క్రేన్లు, బారికేడ్లు, మంచి నీటి వసతి, గత ఈతగాళు, లైటింగ్ వంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పటిష్టమైన భద్రత చర్యలతో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
విగ్రహాల నిమజ్జనం జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు మాత్రమే చేయాలని, విగ్రహాలు తీసుకువచ్చిన భక్తులను నిమజ్జనానికి అనుమతించకూడదని అధికారులకు సూచించారు. అలాగే నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి పెద్ద చెరువును సీపీ సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు. సీపీ వెంట అదనపు డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, కీసర సీఐ వెంకటయ్య, కుషాయిగూడ ట్రాఫిక్ సీఐ రవీందర్, ఎస్ఐలు రాజశేఖర్, డీసీపీ గిరిధర్, మల్కాజిగిరి ఏసీపీ నరేశ్ రెడ్డి, ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, తాసీల్దార్ జి.కృష్ణ, ఇరిగేషన్ ఏఈ పరమేశ్, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కౌన్సిలర్ నాగేశ్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, కమిషనర్ వేమన రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.