సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రజలకు సూచించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. శనివారం నేరెడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో వినాయక నవరాత్రి ఏర్పాట్లు, బందోబస్తుపై రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ఘనంగా జరుపుకోవాలన్నారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని, ఆ నిబంధనలను మండపం నిర్వాహకులు, కమిటీలు పాటించాలని సూచించారు. గణేష్ మండపంలో 24 గంటల పాటు వాలంటీర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, అంతే కాకుండా భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వినాయక ఉత్సవాల భద్రతకు సంబంధించి, జీహెచ్ఎంసీ, అగ్ని మాపక శాఖ, నీటి పారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో రాచకొండ పోలీస్ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంగా పనిచేస్తూ, శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరుపుకునేలా అన్ని శాఖల సిబ్బంది కృషి చేయాలన్నారు.
వినాయక నిమజ్జనోత్సవానికి రాచకొండ పరిధిలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. ఈ నెల 28న జరిగే గణేష్ నిమజ్జనం కోసం భారీ పోలీసు బందోబస్తుతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్విమ్మర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా చెరువులు, ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు, విద్యుత్ లైట్లను, బారికేడ్లు, మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన సీపీ చౌహాన్, సమస్యలను తానే స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, ట్రాఫిక్ డీసీపీ-1 అభిషేక్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ-2 శ్రీనివాసులు, మలాజిగిరి ఇన్చార్జ్ డీసీపీ గిరిధర్ రావు, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, డీసీపీ ఎస్బీ, డీసీపీ క్రైమ్స్ అరవింద్, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషారాణి, మలాజిగిరి అదనపు డీసీపీలు, ఏసీపీలతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత రావు, వైస్ ప్రెసిడెంట్ రావినూతల శశిధర్ తదితరులు పాల్గొన్నారు.