దుండిగల్,అక్టోబర్18: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్లో ముసలం నెలకొంది. టికెట్టు ఆశించి దక్కకపోవంతో భంగపడిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి అలకబూనారు. కొలన్ హన్మంతరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో అధిష్టానంలో కలవరం మొదలయ్యింది. భవిష్యత్లో నర్సారెడ్డి భూపతిరెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యతను కల్పిస్తామని నేతలు బుజ్జగిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరపేంట్కు చెందిన నర్సారెడ్డి భూపతిరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి క్రీయాశీలకంగా పని చేస్తున్నారు. అప్పటికే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్లో ఖాళీ కావడంతో రేవంత్రెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో నియోజకవర్గం అంతటా కలయి తిరుగుతూ గత కొన్నాళ్లుగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీలో క్రీయాశీలకంగా పని చేస్తున్న కుత్బుల్లాపూర్ మాజీ ఎంపీపీ కొలన్ హన్మంతరెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కొలన్ హన్మంతరెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డిలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టారు. టిక్కెట్టు తనకే వస్తుందంటే తనకే వస్తుందని ధీమాతో ముందుకెళ్లారు. అయితే ఎమ్మెల్యే టిక్కెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్న నర్సారెడ్డి భూపతిరెడ్డిని కాదని అధిష్టానం కొలన్ హన్మంతరెడ్డికి టిక్కెట్టు ఖరారు చేసింది. దీనికి సంబంధించిన జాబితాను ఈ నెల 15న విడుదల చేసిన జాబితాలో కొలన్ హన్మంతరెడ్డి పేరును ఖరారు చేయడంతో ఖంగుతిన్న భూపతిరెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తికి గురై అలకబూనారు. నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విషయం గ్రహించిన పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం భౌరంపేటలోని ఆయన కార్యాలయం వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు నర్సారెడ్డి భూపతిరెడ్డిని బుజ్జగించినట్లు సమాచారం.
కుత్బుల్లాపూర్,అక్టోబర్18: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు సూదుల సంపత్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం పార్టీ సభ్యత్వంతో పాటు డివిజన్ అధ్యక్షపదవీకి రాజీనామా చేసిన్నట్లు ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్లో జరుగుతున్న పలు సంఘటనలతో విసుగు చెంది, ప్రజలకు చేరువలో ఉంటూ, ఎనలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధం అయిన్నట్లు ఆయన తెలిపారు. గురువారం ఉదయం జీడిమెట్ల డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమక్షంలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధం చేసుకున్నాని తెలిపారు.