సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త అత్యాధునిక సాంకేతికతలతో మానసిక ఒత్తిడిలను తట్టుకునేందుకు క్వాంటమ్ ఉత్పత్తుల అవసరం ఎంతో ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. న్యూజెర్సీ కేంద్రంగా ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థ హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్వాంటమ్ సేవలు దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ లభించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
ఐటీ సంస్థలకు ప్రపంచ స్థాయి సదుపాయాలన్నీ ఇక్కడ లభిస్తున్నాయని, ప్రజలు ఆయా కంపెనీలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్వాంటమ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సీఈవో సంజయ్ చిత్తోర్ మాట్లాడుతూ తమ ఉత్పత్తులు సాంకేతికతలోనే కాకుండా సమాజంలోనూ ప్రభావం చూపేలా ఉంటాయన్నారు. అందుకు ప్రత్యేక ఉదాహరణ తమ ఉత్పత్తి అయిన హీల్ ముందంజలో ఉందని, మానసిక ఆరోగ్య సమస్యలపై తక్షణ అవసరాలను గుర్తించి, చికిత్సకు దోహదం చేసేలా తమ సాప్ట్ ఉత్పత్తి ఉంటుందన్నారు.
ట్రిపుల్ ఐటీ బాసర సహకారంతో విద్యార్థులకు మానసిక ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెచ్చేల పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు ఒద్దిరాజు రవిచంద్ర, నిర్వాహకులు నరేందర్, సంజయ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.