సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఆటోమేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంపై దృష్టి సారించామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ సర్కిల్ కళ్యాణ్నగర్లోని సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా తీరును, స్కాడా కేంద్రాన్ని ఆయన సర్కిల్ ఎస్ఈ చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలంటే డిస్కం పరిధిలోని నెట్ వర్క్ మొత్తాన్ని ఆటోమేషన్ చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను పూర్తి చేసి కొత్తగా ఆధునీకరించిన మొబైల్ యాప్తో అనుసంధానం చేయనున్నామని సీఎండీ తెలిపారు. ఏటా విద్యుత్ డిమాండు గణనీయంగా పెరుగుతోందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్కిళ్ల వారీగా సబ్ స్టేషన్ల ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, కొత్తగా లైన్లను ఏర్పాటు చేసుకోవాలని సర్కిళ్ల ఉన్నతాధికారులకు సూచనలు చేశామన్నారు. వేసవి కార్యాచరణలో భాగంగా ఏయే సర్కిళ్లలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించారన్న విషయాలను ఆరా తీశారు. ముఖ్యంగా లోడు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, ఇందుకు అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై నివేదికలు ఇవ్వాలని సూచించారు.
ఉన్నతాధికారులు సూచనలు..
సబ్ స్టేషన్ తనిఖీలో భాగంగా లోడ్ ఎంత ఉంది? అదనంగా పెరిగితే ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ఎలక్ట్రికల్ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. లాగ్ బుక్ తనిఖీ చేసి.. 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల పరిధిలో జరిగిన అంతరాయాలు, వాటి సమయం ఎంత మేర ఉందని చూశారు. సబ్ స్టేషన్లలో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్స్ పనితీరును, బ్రేకర్స్, రిలే పరికరాలు వంటి వాటిని ప్రత్యేకంగా పరిశీలించారు. సబ్ స్టేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు భద్రతా ప్రమాణాలను పాటించాలని, హెల్మెట్లను, ఎర్త్ రాడ్లను, ఇతర భద్రతా వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.