సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : బస్సుల్లో చిల్లర సమస్యలను పరిష్కరించడానికి ఆర్టీసీ తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్, కార్డు స్వైపింగ్ అందించే ఇంటలిజెంట్ టికెటింగ్ ( ఐటిమ్) మిషన్ల సేవలపై విమర్శలు వస్తున్నాయి. ఇవి సాంకేతిక సమస్యలతో పనిచేయడం లేదు. మరోవైపు కండక్టర్లకు టిమ్ మిషన్ల చెల్లింపులు కష్టతరంగా మారాయని చెబుతున్నారు.
దీంతో టిమ్ మిషన్లపై వారికి అవగాహన లేక డిజిటల్ చెల్లింపుల సేవలు లేవని ప్రయాణికులతో వాగ్వాదానికి దిగుతున్నారు. చిల్లర లేదని ప్రయాణికులు చెబితే బస్సు దిగాలని వేధిస్తున్నారు. ఇలాంటి తరహా సంఘటనలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. డిజిటల్ చెల్లింపులకు ప్రయాణికులు సిద్ధంగా ఉన్నా సర్వర్ బాగా లేదంటూ నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.