హైదరాబాద్: కర్ణాటక బస్సు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవలే బస్సు ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు.
మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున, గాయపడ్డ ఏడుగురికి రూ. 50 వేల చొప్పున చెక్కులను మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుటుంబాలతో కలిసి విహర యాత్రకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో జరిగిన బస్సు ప్రమాదం అందరిని కలచివేసిందన్నారు.
చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షలు గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, కలెక్టర్ శర్మన్, తదితరులు ఉన్నారు.