కొండాపూర్, ఆగస్టు 28: స్థానిక ఫర్నిచర్ ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తూ తగిన మార్కెట్ను కల్పించాలని ఐటీ, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఐకియా 5వ వార్షిక వేడుకలను పురస్కరించుకుని హైటెక్ సిటీలోని ఐకియా స్టోర్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ, ఐకియా మొదటి స్టోర్ను నగరంలో ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ తర్వాత దేశ వ్యాప్తంగా 5 కొత్త స్టోర్లను ప్రారంభించడంతో సంస్థ ప్రతినిధులను అభినందించారు. స్థానికంగా మేటి రకం ఫర్నిచర్ ఉత్పత్తిదారులు అందుబాటులో ఉన్నారని, వారికి తగిన మార్కెట్ను కల్పించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐకియా సీఈఓ, చీఫ్ సస్టెయినెబిలిటీ ఆఫీసర్ సుసానే పుల్వెరెర్, ఐకియా హైదరాబాద్ మార్కెట్ మేనేజర్ క్రిస్టోఫె ఆడ్రియెన్ తదితరులు పాల్గొన్నారు.