తెలుగుయూనివర్సిటీ, జనవరి 12 : తెలంగాణ ప్రాంతం లో మిళితమైన విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను పరిరక్షించుకునే బాధ్యత సమాజంపైనే ఉందని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2018 సంవత్సరానికిగాను లలిత కళలు, సామాజిక అంశాలలో విశేష కృషి చేసిన 43 మందికి గాను మంగళవారం 23 మందికి పురస్కారాలు అందజేయగా, బుధవారం మరో 20 మందికి ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కళలపై విస్తృత పరిశోధనలు చేసి విశ్వవ్యాప్తం చేసేలా తెలుగువర్సిటీ కృషి చేయాలని సూచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషకు, సాహిత్యానికి చేస్తున్న కృషిని కొనియాడారు. తెలుగువర్సిటీ వీసీ కిషన్రావు, రిజిస్ట్రార్ రమేశ్, విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్న ఈ సభలో పురస్కారగ్రహీతలకు రూ5,116ల నగదు, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించారు.