సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) ;అసమ్మతి నేతల నిరసనలతో గాంధీ భవన్ అట్టుడుకుతున్నది. రేవంత్ కో హఠావో.. అనే నినాదంతో కాంగ్రెస్ కార్యాలయం దద్ధరిల్లుతున్నది. గ్రేటర్ పరిధిలోని పాతనగరం నియోజకవర్గాలతో పాటు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ల కేటాయింపుపై అసంతృప్తులు సోమవారం కూడా గాంధీభవన్ వద్ద నిరసనలు తెలిపారు. ఓడిపోయే స్థానాలనే బీసీలకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ కీలక నేతలెవరూ కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రెండు రోజులుగా బోసిపోతున్న గాంధీభవన్ ప్రధాన భవనానికి తాళం వేయడంతో నిరసనలు గన్పార్కును కూడా తాకాయి. అయితే ప్రశ్నిస్తున్న నేతల్ని సస్పెండ్ చేస్తుండటంతో వ్యవహారం మరింత ముదురుతున్నది.
గ్రేటర్ హస్తం రగులుతూనే ఉంది. మొదటి జాబితాపై రెండో రోజూ కూడా నిరసనలు కొనసాగాయి. గ్రేటర్ పరిధిలోని పాతబస్తీ నియోజకవర్గాలతో పాటు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ల కేటాయింపుపై అసంతృప్తులు సోమవారం కూడా గాంధీభవన్ వద్ద నిరసనలు తెలిపారు. దీంతో పార్టీ కీలక నేతలెవరూ కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రెండు రోజులుగా బోసిపోతున్న గాంధీభవన్ ప్రధాన భవనానికి తాళం వేశారు. మరోవైపు కాంగ్రెస్ అసంతృప్తుల నిరసనలు గాంధీభవన్ దాటి గన్పార్కును సైతం తాకాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నిస్తున్న నేతల్ని సస్పెండ్ చేస్తుండటంతో వ్యవహారం మరింత ముదురుతుంది.
పెరుగుతున్న అసమ్మతి సెగలు..
కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల కిందట మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో ఆరు పాతబస్తీకి చెందిన స్థానాలు ఉన్నాయి. అయితే జాబితా విడుదలైన వెంటనే పలు నియోజకవర్గాల్లో వెల్లువెత్తిన అసమ్మతి సెగలు రెండో రోజు కూడా కొనసాగాయి. సోమవారం గాంధీభవన్ ముందు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బహదూర్పురకు చెందిన నేతలు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కాకుండా ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్కో హఠావో.. అనే నినాదం మార్మోగింది. దీంతో పాటు మేడ్చల్ నియోజకవర్గ టికెట్ కేటాయింపుపైనా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలోకి వచ్చిన అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ (జంగయ్య యాదవ్)ను అడ్డుకున్న హరివర్ధన్రెడ్డి వర్గం గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హరివర్దన్రెడ్డి వర్గం గాంధీభవన్కు వచ్చారు. మహిళా నేతలు కూడా వచ్చి ప్లకార్డులతో నిరసన తెలిపారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గాంధీభవన్ ప్రధాన భవనానికి తాళం వేయగా… వెనుక వైపు ఉన్న భవనంలోకి రాకుండా అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడిన తమను అడ్డుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయం అంటూ మహిళా నేతలు సిబ్బందిని ప్రశ్నించారు.
పాతబస్తీలో హస్తం ఆటలు
కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో బీసీ నేతలకు జరుగుతున్న అన్యాయంపై నిత్యం ఎవరో ఒక నేత గళం వినిపిస్తూనే ఉన్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు కేటాయిస్తామన్న ఉదయపూర్ తీర్మానాన్ని కాలరాస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మజ్లిస్ కంచుకోటలైన పాతబస్తీకి చెందిన పలు నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు కేటాయించి, వారిని బీసీ జాబితాలో చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాతబస్తీలో మొత్తం ఉన్న ఏడుకు ఏడు స్థానాలు గాలిపటమే ఎగురేసుకుపోతుందని చంటి పిల్లాడిని అడిగిన టక్కున చెబుతాడు. కార్వాన్ మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాలు గాలిపటాన్నే ఎగురవేస్తాయి. అయితే చెల్లని నియోజకవర్గాలను బీసీలకు కేటాయిస్తారా అని పలు బీసీ సంఘాలు, కాంగ్రెస్ బీసీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు టికెట్ ఇవ్వడం లేదని ముందుగానే తెలుసుకున్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఇదే అంశంపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన నివాసంలో పలువురు నేతలతో భేటీ అయిన ఆయన బీసీ నేతలతో పాటు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వారికి పార్టీ అధిష్టానం అన్యాయం చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ టికెట్ ఆశిస్తున్న ఆయనకు రేవంత్ చెక్ పెడుతూ… ముద్దగోని రామ్మోహన్గౌడ్ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. దీంతో లోలోపల రగిలిపోతున్న మధుయాష్కీ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మ రింత స్వరం పెంచే అవకాశాలున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు.