వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం.. వస్తువులు, వాటి నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం, పొందే సేవలను తెలుసుకోవడం వినియోగదారుల హక్కు. వ్యాపారులు ఎలాంటి మోసాలకు పాల్పడినా, సకాలంలో వస్తువులను అందించకపోయినా, అధిక ధరలకు విక్రయించినా వారి భరతం పడుతున్నారు. తమ హక్కులను కాపాడుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో 2020 డిసెంబర్ నాటికి సుమారు 8,175 కేసులు నమోదు కాగా, అందులో 4,451 కేసులను ఇప్పటికే పరిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 జిల్లాల కమిషన్ల పరిధిలో 98,240 కేసులు నమోదు కాగా అందులో 93,278 కేసులకు సంబంధించి తీర్పులు వెలువడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వినియోగదారుల రక్షణ చట్టం -2019… అక్టోబర్ 2020 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేసి వినియోగదారుల హక్కులను పరిరక్షిస్తున్నారు. ఒక వేళ తమ ఫిర్యాదు తిరస్కరణకు గురైనా, అందుకు గల కారణాలను కూడా తెలుసుకునే హక్కును ఈ చట్టం కల్పించింది.
నూతన చట్టం ద్వారా మూడు స్థాయిల్లో వినియోగదారుల వివాదాలను పరిష్కరిస్తారు. రూ.10 కోట్లపై విలువ ఉన్న వివాదాలను జాతీయ స్థాయిలో కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెస్సెల్ కమిషన్, రూ.కోటి నుంచి రూ.10 కోట్ల వివాదాలు రాష్ట్రస్థాయిలో, రూ.కోటి కంటే తక్కువైతే జిల్లాస్థాయి కమిషన్ పరిష్కరిస్తుంది.
ప్రభుత్వం ఎన్ని కార్య క్రమాలు చేపట్టినా విని యోగదారుల్లో చైతన్యం ఉంటేనే అక్రమాలను నియంత్రించవచ్చు. 19 86 చట్టంతో పోల్చితే కేం ద్ర ప్రభుత్వం 2019లో వినియోగదారుల రక్షణ చట్టం ఎంతో మెరుగైంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వినియోగ దారుల రక్షణలు కల్పిం చారు. నష్ట పరిహార పరిధిని సైతం పెంచారు. ఇది వినియోగదారులకు ఎంతో లబ్ధి చేకూర్చుతుంది. హక్కులను కాపాండేందుకు మరింత దోహదం చేస్తుంది. – పల్లెపాడు దామోదర్, రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు
దిల్సుఖ్నగర్కు చెందిన మహ్మద్ మొహసిన్ 2019 జులైలో పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్లో వాటర్ బాటిల్ను కొనుగోలు చేశాడు. ఎమ్మార్పీ రూ.20 ఉండగా, రెస్టారెంట్ నిర్వాహకుడు రూ.10 అదనంగా రూ.30 వసూలు చేశాడు. బిల్లు చూసుకున్న వినియోగదారుడు మహ్మద్ ఇదే విషయమై హోటల్ నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కమిషన్ అపెక్స్ కోర్టు.. తాము అదనంగా వసూలు చేసుకోవచ్చన్న హోటల్ నిర్వాహకుల వాదనతో ఏకీభవించలేదు. రెస్టారెంట్ కావాలనే నిబంధనలను తప్పుదోవ పట్టిస్తూ అదనంగా వినియోగదారుల నుంచి చార్జీలను వసూలు చేస్తున్నదని నిర్ధారించింది. వినియోగదారుడిని అసౌకర్యానికి గురి చేయడంతో పాటు, మానసికక్షోభకు గురిచేసినందుకు అదనంగా వసూలు చేసిన రూ.10కి 12శాతం వడ్డీతో కలిపి మొత్తంగా రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని రెస్టారెంట్ నిర్వాహకులను ఆదేశించింది. అలాగే వినియోగదారుడికి కోర్టు ఖర్చులు రూ.5 వేలను కూడా 45 రోజుల్లో రెస్టారెంట్ నిర్వాహకులే చెల్లించాలని స్పష్టం చేసింది.