మార్చి చివరి నాటికి నూరు శాతం వసూళ్లే లక్ష్యంగా అధికారుల స్పెషల్ డ్రైవ్
బకాయిదారులకు నోటీసులు జారీ
సర్కిల్-15 పరిధిలో మొండి బకాయిదారుల గుర్తింపు
ముషీరాబాద్, మార్చి 2 : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఆస్తి పన్ను వసూలుకు అధికారులు స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. ఆస్తి పన్ను చెల్లింపు జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరితోపాటు మొండి బకాయిదారుల నుంచి నూరు శాతం పన్ను వసూలే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మొండి బకాయిదారుల జాబితా సిద్ధం చేసిన అధికారులు సదరు సంస్థలు, ఆస్తుల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రతియేటా ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారిని సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే టాప్ మొండి బకాయిదారుల జాబితా సిద్ధం చేశారు. సర్కిల్ పరిధిలో పెద్దఎత్తున పన్ను బకాయిపడ్డ హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను గుర్తించిన అధికారులు రెడ్ నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. వీటికి స్పందించకపోతే సదరు సంస్థల (ఆస్తుల) జప్తు చేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు..
సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో ప్రత్యేక బృందాలను నియమించారు. డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ నేతృత్వంలో అధికారులు తొలి విడుతగా పెద్దఎత్తున ఆస్తిపన్ను బకాయిపడిన వారి నుంచి పన్ను రాబట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. డివిజన్ల వారీగా టీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సర్కిల్-15 పరిధిలో ఈ ఏడాది రూ.50 కోట్లు ఆస్తిపన్ను రాబట్టాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న అధికారులు ఇప్పటికే రూ.30 కోట్ల మేర పన్ను వసూలు చేశారు. మరో రూ.20కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఏ ఒక్కరినీ వదలకుండా బకాయిపడిన వారి నుంచి పన్ను వసూలు చేయనున్నారు. గత ఏడాది సర్కిల్ పరిధిలో రూ.37.5 కోట్లకుపైగా పన్ను వసూలు కాగా, ఈ ఏడాది రూ.50 కోట్ల టార్గెట్కు చేరువ కావాలని యోచిస్తున్నారు.
బకాయిదారుల జాబితా సిద్ధం
రూ.50వేలు, లక్షకు పైబడి ఆస్తి పన్ను బకాయిపడిన వారి జాబితా సిద్ధం చేసిన అధికారులు సాధారణ నోటీసులతోపాటు తీవ్ర హెచ్చరికలు వ్యక్తం చేసే రెడ్ నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. ప్రధానంగా సర్కిల్ పరిధిలో ఉన్న హోటళ్లు, వ్యాపార సంస్థలు, వివిధ శాఖల కార్యాలయాలు ఆస్తి పన్ను బకాయిపడగా సదరు సంస్థలకు నోటీసులు జారీ చేస్తున్నారు.
చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తాం..
సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి జీహెచ్ఎంసీకి సహకరించాలి. తద్వారా అభివృద్ధికి చేయూత అందించినవారవుతారు. పన్ను చెల్లించకపోతే స్తిర, చరాస్తులు జప్తు చేయడం జరుగుతుంది. తొలుత సాధారణ నోటీసులు, అప్పటికీ స్పందించకపోతే రెడ్ నోటీసులు జారీకి చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ మార్చి 30వ తేదీలోగా ఆస్తి పన్నులు చెల్లించి జీహెచ్ఎంసీ సహకరించాలి.
– హరిక్రిష్ణ, డిప్యూటీ కమిషనర్, సర్కిల్-15